Take a fresh look at your lifestyle.

తెలంగాణను అవమానించిన తేజస్వి సూర్య ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: పొన్నం ప్రభాకర్

0 224

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ తేజస్వి సూర్యపై నిప్పులు చెరిగారు. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు అత్యంత అజ్ఞానంతో కూడుకున్నవని, అవి ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించేలా ఉన్నాయని పొన్నం పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించాలని, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన రాష్ట్రాన్ని అవమానించినందుకు ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ డీఎన్ఏ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వ్యాఖ్యలను ఖండించాలని పొన్నం పిలుపునిచ్చారు. రాష్ట్ర గౌరవాన్ని కించపరిస్తే తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అని ఆయన నిలదీశారు. తెలంగాణ ఏర్పాటు అనేది దశాబ్దాల పోరాటమని, వేలాది మంది త్యాగాల ఫలితమని, దానిని విద్వేషపూరిత విభజనతో పోల్చడం రాజ్యాంగాన్ని కించపరచడమేనని మండిపడ్డారు. తేజస్వి సూర్యకు తెలంగాణ చరిత్రపై కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఒక జాతీయ పార్టీకి చెందిన ఎంపీ ఇంత బాధ్యతారాహిత్యంతో మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

Leave A Reply

Your email address will not be published.